Connect with us

Telangana

తెలంగాణలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి విద్యుత్ ఆదాయం రూ.14,000

విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే లక్ష్యంతో ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చడానికి లక్ష్యంగా ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు ఒక చిన్న విద్యుత్ కేంద్రంగా మారుతుంది. గ్రామాల్లోని ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటారు. మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించే వెసులుబాటు కల్పించారు. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.4,000 నుంచి రూ.5,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

సాధారణంగా ఒక ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల ద్వారా సంవత్సరానికి సుమారు 1,086 యూనిట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్‌కు రూ.2.57 చొప్పున ఈ విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించవచ్చు. అంతేకాదు, ఇంటి కరెంటు అవసరాలన్నీ సోలార్ ద్వారానే నెరవేరడం వల్ల నెలవారీ విద్యుత్ బిల్లులు పూర్తిగా తప్పుతాయి. దీనివల్ల ఒక కుటుంబానికి ఏడాదికి మరో రూ.14,000 వరకు ఆదా అవుతుంది. ఆదాయం, ఆదా రెండూ కలిస్తే కుటుంబాల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడనుంది.

మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,380 కోట్లను వెచ్చిస్తోంది. ఈ ప్రాజెక్టు భాగంగా బోనకల్లు మండలంలోని 22 గ్రామాలను పూర్తిస్థాయి సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నారు. రావినూతల గ్రామం ఒక్కదానికే రూ.24 కోట్లు కేటాయించడం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను చూపిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఈ పథకం వేగంగా అమలవుతోంది.

ఈ పథకం వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు తమ పొలాల్లో పంపుసెట్ల పైన సోలార్ ప్యానళ్లను పెట్టుకోవచ్చు. అలాగే రైతులు పగటిపూట ఉచిత విద్యుత్ పొందవచ్చు.

రైతులు మోటార్లు ఉపయోగించని సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానించి అదనపు ఆదాయం సంపాదించవచ్చు. సోలార్ ప్యానళ్ల కింద ఏర్పాటు చేసే షెడ్లను రైతులు పశువుల పాకగా లేదా వ్యవసాయ పనిముట్ల గదిగా వినియోగించుకోవచ్చు.

ఇక ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలపై కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా.. పర్యావరణహితమైన స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవనుంది. మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని, సోలార్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లల విద్య, ఆరోగ్య అవసరాలకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

#SolarModelVillage#TelanganaGovernment#SolarRevolution#GreenEnergy#RenewableEnergy#BhattiVikramarka#Khammam#Ravinuthala
#SolarPower#FreeCurrent#AdditionalIncome#FarmersBenefits#SustainableDevelopment#CleanEnergy#TeluguNews

Loading