Telangana

Telangana: రైతు భరోసా.. త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు..

తెలంగాణ ప్రభుత్వం అనేక రైతుల సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. సుమారు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18 వేల కోట్లు జమ కాగా, మరో 13 వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు రుణమాఫీ అమలు కావటంతో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, రైతులకు ప్రభుత్వం త్వరలోనే మంచి వార్త చెప్పనుంది. రైతు భరోసాను ఈ నెల చివర నుండి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు అవసరమైన డబ్బులను సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు చెప్పారు. మొదట ఒక ఎకరా నుండి ప్రారంభించి, డిసెంబర్ చివర నాటికి పూర్తిగా సాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10 వేలు (ఖరీఫ్, రబీ రెండు విడతల్లో) అందించింది. ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చిన రేవంత్ ప్రభుత్వం, ఎకరాకు రూ. 15 వేలు రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ పథకం అమల్లోకి రాలేదు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు నిధులు ఇచ్చిందని ప్రస్తుత మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కచ్చితమైన విధానాలు ఖరారు చేసి, కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

నిజానికి, దసరా నుంచే రైతు భరోసా అందించాలనుకున్నారు. కానీ అప్పటికే కొంతమంది రైతులకు రుణమాఫీ డబ్బులు జమ చేయాల్సి వచ్చింది. అలాగే, కొన్ని ప్రభుత్వ పథకాలకు నిధులను సర్దుబాటు చేయడం వల్ల రైతు భరోసా అమలు కాలేదు. ఈనెలాఖరు నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతి 10 రోజులకు రూ.1,500 కోట్ల నుంచి 2 వేల కోట్ల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేసేలా ఫ్లాన్ చేస్తు్నట్లు తెలసింది. 45 రోజుల్లో కనీసం రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.

రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలో తెలుసుకునేందుకు అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. చాలామంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం బాగుంటుందని చెప్పారు. మరికొందరు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు. ఈ విషయం మీద అభిప్రాయాలు తీసుకున్న కేబినెట్ ఉప కమిటీ, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోట్ను తయారుచేసిందని తెలుస్తోంది. ఈ డ్రాఫ్ట్ నోటును కేబినెట్‌లో చర్చించడంతో పాటు, అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చించి లిమిట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version