Telangana
ఓటుకు నోటు కేసుపై కీలక నిర్ణయం

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్కు ఊరట.. ఓటుకు నోటు కేసుపై కీలక నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత రెడ్డి నిందితులుగా ఉన్నారు. పదేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూ ఉంది. అయితే, రేవంత్ సీఎంగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తారని, అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్ధనను నిరాకరించింది. కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ట్రాన్స్ఫర్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ద్విసభ్య ధర్మాసనం.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదనను తిరస్కరించింది. ఒకవేళ, కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నట్టయితే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
అలాగే,, ముఖ్యమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఏసీబీ అధికారులు దర్యాప్తు వివరాలను సీఎం, హోమ్ మంత్రికి నివేదించరాదని ఆదేశించింది. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మె్ల్సీ ఎన్నికల సందర్భగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి కాల్ రికార్డింగ్స్ అంటూ ఓ ఆడియో అప్పట్లో బయటకు వచ్చింది.