National
అణ్వాయుధ బెదిరింపులకు భయపడం : PM మోదీ
భారతదేశం అణ్వాయుధ బెదిరింపులకు ఏమాత్రం భయపడబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, భారత్పై జరిగే ప్రతి ఉగ్రదాడికి దీటుగా సమాధానం ఇస్తున్నామని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందని, దేశ భద్రతకు ఎలాంటి రాజీ లేకుండా చూస్తామని ఆయన ఉద్ఘాటించారు. భారత్ శాంతిని కోరుకునే దేశమని, కానీ దాని భద్రతను సవాలు చేసే శక్తులకు తగిన గుణపాఠం చెప్పగల సత్తా తమకు ఉందని మోదీ స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు ఎప్పుడు, ఎలా బదులివ్వాలనే నిర్ణయాన్ని భారత సైన్యమే తీసుకుంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్లు, ఎయిర్ స్ట్రైక్ల ద్వారా భారత్ గట్టిగా స్పందించిందని ఆయన గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఆధునిక ఆయుధాలు, సాంకేతికతతో సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని, దాన్ని ప్రోత్సహించే శక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని, అవసరమైతే సరిహద్దులు దాటి కూడా చర్యలు తీసుకుంటామని ప్రధాని హెచ్చరించారు.