india news
బెంగాల్ రాజకీయ చాణక్యుడు ముకుల్ రాయ్ కన్నుమూత: విషాదంలో తృణమూల్ శ్రేణులు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ధృవతారగా వెలిగిన ముకుల్ రాయ్ (71) సోమవారం తెల్లవారుజామున కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ‘డిమెన్షియా’ వ్యాధితో పోరాడుతున్న ఆయనకు, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన కుమారుడు సుబ్రాన్షు రాయ్ వెల్లడించారు.
మమతకు కుడిభుజంగా, తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ముకుల్ రాయ్, మమతా బెనర్జీ రాజకీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అమోఘం,కేంద్ర మంత్రిగా, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి జాతీయ రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు.2017లో బీజేపీలో చేరిన ఆయన, 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో కమలం పార్టీ 18 సీట్లు గెలవడంలో ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత 2021లో తిరిగి సొంత గూడు తృణమూల్కు చేరుకున్నారు.
ముకుల్ రాయ్ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ముకుల్ ఒక గొప్ప సహచరుడు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు” అని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు జాతీయ నేతలు ఆయనకు నివాళులర్పించారు.
![]()
