Andhra Pradesh
ఒక్క కారణంతో వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ..

వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ అయినా వాసిరెడ్డి పద్మ.. వైస్సార్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ఒక లేఖను వైఎస్సార్సీపీ పంపించారు. ‘ఈ పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు గుడ్ బుక్, ప్రమోషన్లు అని అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు గుండెబుక్. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. తమ జీవితాలను, ప్రాణాలను పెట్టిన కార్యకర్తలను.. జగన్ గారు అవసరం లేదు అనుకుని ఇప్పుడు గుడ్బుక్ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధమవుతున్నారు’ అంటూ ఆ లేఖలో రాసారు.
‘పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశాను. ప్రజాతీర్చు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైఎస్సార్సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను’ అంటూ లేఖ రాశారు.
ఆమె వైఎస్సార్సీపీ కోసం కష్టపడి పనిచేస్తే.. వ్యక్తిగతంగా ఆమెకు అన్యాయం జరిగిందని.. ఆ అంశాలపై త్వరలోనే మాట్లాడతానని అంటున్నారు పద్మ. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని నడపటం రాష్ట్రానికి చాల ప్రమాదమన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా మహిళలపై నేరాలు, ఘోరాలు జరుగుతాయని.. ఇలాంటి విషయాల్లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే బాగుంటుందన్నారు.
మహిళలకు అన్యాయం జరిగితే రాజకీయం చేయడం కోసం వెళ్లడం సరికాదన్నారు వాసిరెడ్డి పద్మ. మహిళలకు సంబంధించిన వైఫల్యాలు ఉంటే కచ్చితంగా మాట్లాడాలని.. నిందితుల్ని వెనుకేసుకొచ్చే కాపాడే ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వాన్ని పోరాడాల్సిందే, నిలదీయాల్సిందే అన్నారు. కానీ ఘటన జరిగిన వెంటనే దాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం.. మహిళల్ని కూడా రాజకీయాలకు అడ్డం పెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నారు. మహిళల్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని.. ‘మన హయాంలో ఏమీ జరగలేదు.. ఇప్పుడున్న ప్రభుత్వంలోనే అఘాయిత్యలు జరుగుతున్నాయి అని అనడం సరికాదు’ అన్నారు.
ప్రజలు వాస్తవాలను గమనిస్తుంటారనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు.జగన్కు వైఎస్సార్సీపీకి కార్యకర్తలే అవసరం లేదనుకుంటున్నారని వ్యాఖ్యానించారు పద్మ. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకోవాల్సింది పోయి.. అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పదే, పదే ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు వేశానని మాత్రమే జగన్ చెప్తున్నారని.. పేద ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మద్యం ద్వారా వారి రక్తాలను పీల్చాలని ఎవరైనా అనుకుంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని.. ఎవరినీ సంప్రదించలేదన్నారు.
జగన్ను వ్యతిరేకించాలనే లక్ష్యం తప్ప ఏమీ లేదన్నారు పద్మ. ప్రజలతో ఉంటాను.. రాజకీయాల్లో కొనసాగుతానని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. రాజకీయ ముసుగులో జరిగే అన్ని అన్యాయాలపై మాట్లాడతానని.. రాజకీయాల్లో ధైర్యం ఉండాలన్నారు. పార్టీలు ఊరికే మనిషిని కాదని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా.. పార్టీల మారడం అంత మంచిది కాదని.. ఇంతవరకు అన్నీ భరించి ఉన్నానన్నారు. కానీ ఇప్పుడు నాయకుడి మీద నమ్మకం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చానన్నారు.