Telangana
ఇంతకన్నా దురదృష్టం ఉండదు గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం..

ఇంతకన్నా దురదృష్టం ఉండదు గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం..
హైదరాబాద్ మణికొండలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగి కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన రోజే ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజగదిలో దేవుడికి పెట్టిన దీపం కారణంగా మంటలు చేలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 25 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.
సొంతిల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అందుకోసం రూపాయి రూపాయి జాగ్రత్తగా దాచి పెట్టుకుంటారు. కొందరు జీవితాంతం సంపాదించిన కష్టార్జితంతో సొంతిల్లు కొనుక్కుంటారు. ఇక హాయిగా అందులో జీవితం గడపొచ్చని ఊహించుకుంటూ ఉంటారు. అయితే దేనికైనా అదృష్టం ఉండాలి. కొందరు సొంతిల్లు తీసుకున్నా.. అందులో ఉందామనుకునేలోపే ఏదో ఓ విధంగా ఆటంకం ఎదురవుతుంది. వారి కలల్ని ఆ ఆటంకాలు కూల్చిస్తాయి. ఇంతకన్నా దురదృష్టం ఉండదనే విధంగా కొన్ని ఘటనలు చోటు చేసుకుంటాయి.
హైదరాబాద్లో ఓ వ్యక్తికి అటువంటి అనుభవమే ఎదురైంది. గృహప్రవేశం చేసిన కొన్ని గంటల్లోనే ఇల్లు పూర్తిగా దగ్దమైంది. పూజగదిలో పెట్టిన దీపం అంటుకుని ఇల్లు కాలిబూడిదైంది. దీంతో ఆ వ్యక్తి ఆవేదనకు అంతులేకుండా పోయింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్లో ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, సంతోష్ అనే వ్యక్తి నగరానికి చెందినవాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతకాలం ఒక ఇంట్లో అద్దెకు ఉండే సంతోష్, తన జీతం డబ్బులు ఈఐపీఎల్ 9వ అంతస్తులో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్ కొత్త ప్లాట్లో గృహప్రవేశం చేసాడు. గృహప్రవేశం సమయంలో పూజగదిలో దేవుడికి నూనె దీపం వెలిగించారు. కానీ రాత్రి మధ్యలో దీపం కింద ఉన్న బట్టకు మంటలు అంటుకుని పూజగదిలో అగ్నిప్రమాదం జరిగింది.
ఆ సమయంలో సంతోష్ కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. మంటలు వేగంగా.. పక్కనే ఉన్న కాటన్కు, డోర్, ఫర్నిచర్కు, ఫ్లోర్సిలింగ్, కిటికీల కర్టన్లకు వ్యాపించాయి. ఉన్నట్లుండి ఇంట్లో మంటలు రావటాన్ని గమనించిన సంతోష్ కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేశారు. అనంతరం ఎలాగో అలా ప్లాట్ నుంచి బయటపడ్డారు. స్థానికుల వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు.
అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. దాదాపు రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగిందని సంతోష్ వెల్లడించారు. ప్రాణనష్టం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. గృహ ప్రవేశం రోజే కొత్త ఇల్లు దగ్ధమైందని.. అంతకన్నా దురదృష్టం మరోకటి ఉండదని బంధువులు, స్థానికులు అనుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.