Telangana

తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం

తిరుమల కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఘాటుగా స్పందిస్తున్నారు. పవిత్రమైన లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు లభ్యం కావటం పట్ల ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా సీరియస్ అయింది. టీటీడీ దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుక చెందిన ఏఆర్ డెయిరీ కంపెనీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం రేపటంతో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.

యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని టెస్టుల కోసం హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మదర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యితోనే ఆలయంలో లడ్డూతో పాటు ఇతర ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఇక ఆలయంలో లడ్డూ తర్వాత అధికంగా పులిహోరను భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో పులిహోరపైనా అధికారులు ఫోకస్ పెట్టారు. పులిహోర నాణ్యతను పరీక్షిస్తున్నారు. నెయ్యి పరీక్షల అనంతరం ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా అధికారులు లడ్డూ తయారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇక తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే లడ్డూకు ల్యాబ్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు ఉందని రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయిందని అన్నారు. స్వామివారి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడి గత వైసీపీ ప్రభుత్వ పాలకులు దోపిడీ చేశారని ఆయన మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బతీశారని విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ఒక మోసగాడని, ఒక బ్లాక్ మెయిలర్ అని మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version