Telangana

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం..

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో మరోసారి దొంగతనం జరిగింది. రూ.10 లక్షలు చోరీకి గురయ్యాయి. మంగళవారం చోరీ విషయమై రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. ఇవాళ దొంగను పట్టుకున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని తిరుపతిలో అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లిలో మంచు టౌన్‌షిప్‌లో మోహన్ బాబుకు నివాసం ఉంది. ఈ ఇంట్లో గత 12 ఏళ్లుగా మోహన్ బాబు దంపతుల నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో కిరణ్ తేజ్, గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా కూడా చాలా కాలంగా పని చేస్తున్నారు.

రెండ్రోజుల క్రితం తిరుపతిలోని మోహన్‌ బాబుకు సంబంధించిన మరో ఇంటి నుంచి గణేష్‌, కిరణ్ తేజ్ జల్‌పల్లిలోని ఇంటికి రూ.10 లక్షలు క్యాష్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కిరణ్ తేజ్ పడుకోవడానికి తన గదికి వెళ్లాడు. కిరణ్ తేజ్ పడుకోవటానికి వెళ్లిన కాసేపటికే గణేష్ రూ.10 లక్షలతో ఉడాయించాడు. గణేష్ కనిపించకపోవటంతో ఆందోళన చెందిన కిరణ్ విషయాన్ని మోహన్‌బాబుకు తెలియజేసాడు. అనంతరం మోహన్ బాబు సూచన మేరకు కిరణ్ తేజ్ అదేరోజు రాత్రే పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసును నమోదు చేసుకున్న పహాడి షరీఫ్ పోలీసులు విచారణ చేపట్టారు.

అనంతరం విషయాన్ని మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాలతో దర్యాప్తులో వేగం పెంచిన పహడీ షరీఫ్ పోలీసులు తిరుపతిలో నిందితుడు గణేష్‌ను పట్టుకున్నారు. అతని వద్ద రూ. 10 లక్షలు రికవరీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version