Connect with us

Telangana

హైదరాబాద్‌లో కొత్త రకం కల్చర్‌.. పబ్బుల్లో యువతులను ఎరగా వేసి..

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఓ పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పబ్బుల్లో గబ్బు పనులు చేస్తూ.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టాస్ పబ్‌ నిర్వహిస్తున్న పోలీసుల దాడుల్లో తేలింది. హైదరాబాద్ నగరంలో కొత్త రీతిని ప్రారంభిస్తూ, పబ్‌కు కస్టమర్లను ఆకర్షించడానికి యువతులను ఎరగా వాడుతున్నారని గుర్తించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో పబ్‌లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నారు. పబ్‌కు వచ్చే యువత ముందు అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ డబ్బులు వెనుకేసుకుంటున్నారు.

పోలీసులు పబ్‌పై దాడి చేసినప్పుడు మొత్తం 140 మంది యువతీ, యువకులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. అశ్లీల నృత్యాలు చేయడానికి వచ్చిన 40 యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. పబ్‌లో నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం ఆ దిశగా.. పోలీసులు విచారణ చేపట్టారు. పబ్‌కు వెళ్లిన దాదాపు 100 మందికి నోటీసులు జారీ చేశారు.

నగరంలోని పబ్‌లపై టాస్క్‌పోర్స్, నార్కోటిక్, ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీకెండ్‌లో జరిగే పార్టీలపై నిఘా ఉంచుతున్నారు. ఇటీవల 75 పబ్‌లపై దాడులు జరపగా, కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. మరికొన్ని పబ్స్‌లో మైనర్లు నకిలీ ఆధార్లతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఇంకొన్ని చోట్ల దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి.

అమ్మాయిలతో బడా వ్యాపారులకు పబ్ యాజమాన్యం వల విసురుతున్నట్లు తేలింది. వ్యాపారులు, డబ్బున్నవారిని టార్గెట్ చేసి అమ్మాయిలతో ట్రాప్ చేయిస్తున్నారు. అనంతరం పబ్‌లకు రప్పించి పీకలదాకా మద్యం తాగించి అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారం క్రితం ఇలాంటి కేసులో పబ్ నిర్వాహకులు, అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా పబ్‌లో ఈ తరహా దోపిడీ జరుగుతుండగా, పక్కా నిఘాతో దాడులు చేసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

Loading