Andhra Pradesh
ఏపీలో మందుబాబులకు పెద్ద షాక్ తగిలింది.. షాపుల్లో బ్రాండ్ల కొరత..

ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి షాపులను వాళ్లకి అప్పగించారు. ఆ తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి.. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ కొత్త మద్యం విధానం అమల్లోనే ఉంటుంది. అయితే మందుబాబులకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్రంగా కొరత ఉందని చెబుతున్నారు. వ్యాపారులు ఎన్ని ఆర్డర్లు పెడుతున్నా ఆ బ్రాండ్ల మద్యం తగినంత మేర షాపులకు సరఫరా చేయడం లేదు.
ఇక ఈ మద్యం బ్రాండ్లలో ఎక్కువుగా ఇంపీరియల్ బ్లూ, మెక్ డోవెల్స్ వంటి బ్రాండ్లకు బాగా కొరత ఉందని చెప్తున్నారు. పది కేసులకు ఆర్డర్లు పెట్టిన.. కనీసం ఒక్క కేసు కూడా సరఫరా అవ్వడం లేదు. దీంతో మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. అయితే అధికారులు మాత్రం త్వరలోనే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
రాష్ట్రంలో మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులను ఉపేక్షించవద్దని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలని అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ సిబ్బందితో మంత్రి రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఏపీలో కల్తీ మద్యం లేని రాష్ట్రంగా తయారు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందించాలని.. అవసరమైన చోట్ల డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
మరోవైపు ఏపీలో మద్యం షాపుల్లో MRP కంటే ఎక్కువ తీసుకుంటే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మద్యం ధరల విషయంలో సీఎం ధికారులకు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు.. మద్యాన్ని ఎమ్మార్పీని మించి అమ్మితే తొలిసారి రూ.5లక్షలు జరిమానా విధించాలన్నారు. ఆ తర్వాత కూడా తప్పులు చేస్తే మద్యం షాపుల లైసెన్స్ను రద్దు చేయాలని చెప్పారు. బెల్ట్ షాపుల విషయలో కఠినంగా వ్యవహరించాలని.. అనుమతించవద్దని, బెల్ట్ షాపులను ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సూచించారు.
అంతేకాదు మద్యం షాపులు దక్కించుకున్నవారు కూడా తమకు ఆశించిన మేర లాభాలు రావడం లేదంటున్నారు. తమకు పెద్దగా మార్జిన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో మద్యం షాపుల్లో ఆఫర్లు ప్రకటిస్తున్నారు.. షాపుల ముందు ఆఫర్ల బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఈ షాపులో మద్యం కొంటె.. ఓ గుడ్డు, ఓ గ్లాసు, ఓ వాటర్ ప్యాకెట్ ఫ్రీ అని ఆఫర్లు ఇస్తున్నారు. మద్యం షాపుల్లో సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు.