Andhra Pradesh
RBI షాకింగ్ డెసిషన్.. విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు..

నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా మరోక బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ప్రముఖ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్బీఐ తొలగించింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ చెప్పింది.
2024, నవంబర్ 12వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన తర్వాత బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోతాయని, ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బ్యాంకును పూర్తిగా మూసి వేసి ఒక లిక్విడేటర్ను నియమించాలని కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఆంధ్రప్రదేశ్ను ఆదేశించింది. మంగళవారం నుంచే బ్యాంక్ పూర్తిగా మూతపడిపోయినట్లయింది.
బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినప్పటికీ లిక్విడేషన్ ప్రక్రియ చేపడతారు. దీని ద్వారా ప్రతి డిపాజిటరు తమ డిపాజిట్ బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. బ్యాంకు ఇచ్చిన లెక్కల వివరాల ప్రకారం 95.8 శాతం మంది డిపాజిటర్లు తమ డబ్బులను పూర్తిగా పొందనున్నారు. 2024, ఆగస్టు 31 నాటి లెక్కల ప్రకారం 9.84 కోట్ల డిపాజిట్లను చెల్లించినట్లు ఆర్బీఐ చెప్పింది. దాదాపు ప్రతి ఖాతాదారులకు పూర్తి స్థాయిలో డబ్బులు అందినట్లు అవుతుంది.
బ్యాంక్ కార్యకలాపాలను కొనసాగించినట్లయితే డిపాజిటర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక స్థితిలో, డిపాజిటర్లకు ఈ బ్యాంక్ పూర్తిగా తిరిగి చెల్లింపులు చేయలేదని గుర్తించామని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని భావించి దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.