Andhra Pradesh
సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్ ‘నా బ్రెయిన్లో మెషిన్ పెట్టారు, డీయాక్టివ్ చేయండి

సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్ ‘నా బ్రెయిన్లో మెషిన్ పెట్టారు, డీయాక్టివ్ చేయండి..
తన మెదడును రిమోట్ సాయంతో కంట్రోల్ చేయడానికి కొందరు కుట్రలు చేశారని.. ఇందు కోసం ఓ మెషిన్ సేకరించారని ఆరోపిస్తూ ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ వేయడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం విస్తుపోయింది. వాస్తవానికి దీనిపై అతడు మూడేళ్ల కిందటే హైకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీలు అఫిడ్విట్ దాఖలు చేసి.. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పాయి. దీంతో హైకోర్టు దాన్ని కొట్టివేయగా.. చివరకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఉపాధ్యాయుడు (AP Teacher) దాఖలు చేసిన వింత పిటిషన్తో సుప్రీంకోర్టు (Supreme Court) విస్తుపోయింది. తన మెదడును కంట్రోల్ (Brain Control Machine) చేసేందుకు కొందరు మెషిన్ను పెట్టారని ఆరోపించిన అతడు.. దానిని డీ-యాక్టివ్ చేయాలని కోరడంతో న్యాయమూర్తులు అవాక్కయ్యారు. ఎటువంటి విచారణర్హత లేదని ఈ పిటిషన్ను జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం తిరస్కరించింది. వాస్తవానికి మూడేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) దీనిపై అతడు రిట్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. కొంత మంది హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ (CFSL) నుంచి మానవ మెదడును నియంత్రించే మెషీన్ను తీసుకొచ్చి, తనపై ప్రయోగం చేశారని ఆరోపించాడు. ఆ మెషీన్ను డియాక్టివేట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అఫిడ్విట్ దాఖలు చేయాలని సీబీఐ, సీఎఫ్ఎస్ఎల్కి నోటీసులు జారీచేసింది. తాము ఆ వ్యక్తిపై ఎటువంటి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయలేదని, అలాంటప్పుడు దాన్ని డీ-యాక్టివ్ చేసే ప్రశ్నే ఉండని CFSL అఫిడ్విట్లో పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ-ఇన్-పర్సన్గా హాజరైన పిటిషన్ను నవంబరు 2022లో హైకోర్టు కొట్టివేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. ఈ ఏడాది సెప్టెంబరు 27న జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం ముందుకు వచ్చింది.
ఈ పిటిషన్లోని అంశం తెలుసుకుని ధర్మాసనం విస్తుపోయింది. విచిత్రమైన ఈ పిటిషన్ను విచారణర్హత లేదని, ఇందులో మేము జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చిచెప్పింది. అనంతరం పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. అయితే, పిటిషనర్ సమస్యను అర్థం చేసుకునేందుకు అతనితో అతని మాతృభాషలో పరస్పర చర్చను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీని కోర్టు ఆదేశించింది.
సదరు పిటిషనర్తో మాట్లాడిన తర్వాత నివేదికను సమర్పించిన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ.. అతడు తన మెదడును నియంత్రిస్తున్నట్లు ఆరోపించిన పరికరాన్ని నిష్క్రియం చేయాలనుకుంటున్నట్టు చెప్పాడని అందులో వివరించింది. ‘ఇది పిటిషనర్ చేసిన విచిత్రమైన అభ్యర్థన.. దీని నిర్దిష్టమైన ఆరోపణ ఏమిటంటే, కొంతమంది వ్యక్తుల చేతుల్లో తన మెదడును నియంత్రించే మెషీన్ ఉంది.. రిమోట్ మాదిరిగా వాళ్లు నియంత్రిస్తున్నారని పిటిషనర్ ఆరోపణ.. ఈ విషయంలో మేము ఎలా జోక్యం చేసుకోగలం? విచారణ చేపట్టడానికి ఇందులో మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు’ అని ద్విసభ్య ధర్మాసనం ఆ టీచర్ పిటిషన్ను కొట్టివేసింది.