Latest Updates
పూరీలో పతితపావన జెండా కట్టే సమయం మార్పు..

పూరీలో పతితపావన జెండా కట్టే సమయం మార్పు
ఒడిశాలోని పూరీలో ఏటా జరిగే విశ్వప్రసిద్ధి జగన్నాథ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఈ ఆలయంలో ప్రతిదీ ఓ ప్రత్యేకమే. ఆలయం శిఖరంపై ఓ జెండా రెపరెపలాడుతుంది. ఇది గాలికి వ్యతిరేకంగా వీస్తుంది. దీనిని రోజూ మార్చుతూ ఉండటం మరో విశేషం. రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రతో సోదరి సుభద్ర, కలిసి ఆలయం నుంచి బయటకు వచ్చి పెంచిన తల్లి గుండిచా వద్దకు వెళ్తారు.
ప్రముఖ శ్రీక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయ శిఖరంపై నిత్యం పతిత పావన జెండా రెపరెపలాడుతుంది. ఈ జెండాను రోజూ మార్చుతూ ఉంటారు. చరిత్ర ప్రకారం ఈ క్రతువు 800 ఏళ్లుగా జరుగుతుంది. శీతాకాలంలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య, వేసవిలో 5.30 నుంచి 6 గంటల మధ్య పతితపావన ధ్వజాన్ని మార్చుతారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆ ధ్వజాన్ని చూసి ప్రార్థనలు చేస్తారు. నీలచక్రంపై రెపరెపలాడే పతితపావన జెండా దర్శనం చేసుకోవడం వలన జన్మ ధన్యమవుతుందని భక్తులు గాఢంగా విశ్వసిస్తున్నారు. ఎవరైనా ముడుపులు, మొక్కులు ఉన్నవారు ఆలయ యంత్రాంగానికి నియమిత రుసుం చెల్లించి ఆ జెండాలు కట్టిస్తారు.
214 అడుగుల ఎత్తైన గర్భగుడి శిఖరంపై ఉండే నీలచక్రానికి ప్రతిరోజూ ఇవి కట్టడానికి చునారా సేవాయత్లు ఉంటారు. ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు. శీతాకాలపు గాలులు కూడా వీస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీక్షేత్ర పాలనా యంత్రాంగం పవిత్ర ధ్వజం కట్టే సమయం వారం రోజుల పాటు మార్చాలని నిర్ణయించింది. పాలనా అధికారి అరవిందపాఢి జెండా కట్టే సమయం మార్చినట్టు వెల్లడించారు. వారం రోజుల పాటు మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య ధ్వజం కట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది సోమవారం నుంచి అమల్లోకి రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీక్షేత్రంలో ఆశ్వీయుజ శుక్లపక్షమి ఏకాదశి నుంచి కార్తిక సేవలు ప్రారంభమయ్యాయి. పురుషోత్తముడు 25 రోజులుగా రాధాదామోదర రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీక్షాధారులంతా (హబిషార్ధులు) వ్రతాలు చేస్తున్నారు. కార్తిక మాసం చివరి 5 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో స్వామి వివిధ అవతారాల్లో కనువిందు చేస్తున్నారు. ఈ దశమి తిథిని పురస్కరించుకుని సోమవారం జగన్నాథుడు హరిహరరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
చారిత్రకంగా, పూరీ జగన్నాథ ఆలయాన్ని కళింగ పాలకుడు అనంతవర్మన్ చోడగంగాదేవ్ (క్రీ.శ 1078–1148) ప్రారంభించాడు. జగన్మోహన మరియు విమన భాగాలు ఆయన కాలంలో పూరీ జగన్నాథ ఆలయం నిర్మాణం పూర్తి అయ్యాయి. తరువాత, అనంగ భీమ్ దేవ క్రీ.శ 1174లో పూరీ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం, ఆలయం 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ పునరుద్ధరించారు. ప్రపంచంలో ఎక్కడా హిందూ ఆలయాల్లో ఊరేగింపు, ఉత్సవాలు జరపడానికి మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ప్రతి ఏడాది ఒకే రథాన్ని ఉపయోగిస్తారు. కానీ పూరీ జగన్నాథం ఆలయంలో ఇది భిన్నంగా ఉంటుంది. బలభద్ర, సుభద్రలతో కలిసి ఈ ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు ప్రతి ఏడాది గుడి నుండి బయటకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏడాది కొత్త విగ్రహాలు, కొత్త రథాలు తయారు చేస్తారు.