Entertainment
హిట్ కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకు… అఖిల్ సంచలన నిర్ణయం

తెలుగు చిత్రసీమకి ఎన్టీఆర్-ఏఎన్నార్ రెండు కళ్లు అంటూ చాలా మంది అంటారు. ఇక అలాంటి దిగ్గజ నటుల వారసత్వాన్ని కూడా అంతే ఘనంగా ముందుగు తీసుకెళ్తున్నాయి రెండు కుటుంబాలు. ఇక ఏఎన్నార్ వారసత్వంతో ఇప్పటికే నాగార్జున ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అలానే నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ లు కూడా హీరోలుగా పరిచయం అయ్యారు. నాగ చైతన్య కెరీర్ లో వరుస సినిమాలతో సాగిపోతున్నాడు. కానీ అఖిల్ విషయంలోనే అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనతో ఉన్నారు. అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ విడుదల అయ్యి పదేళ్లు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ ను దక్కించుకోలేదు.
హిట్టు కొట్టాకే
అలానే రెండేళ్లకి ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్న అఖిల్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం గత ఏడాది కాలంగా చాలా కష్టపడుతున్న అఖిల్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ కూడా చాలా నమ్మకాలు పెట్టుకుంది.
ఇక నేడు ఏఎన్నార్ శత జయంతి వేడుక సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్… ఫ్యాన్స్ తో భారీ వేడుక నిర్వహించారు. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ పలువురు ఈ వేడుకలో పాల్గొనగా అఖిల్ కనిపించకపోవడంతో ప్యాన్స్ అయ్యగారు ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగార్జున మైక్ అందుకుని “అఖిల్ హిట్ కొట్టిన తర్వాతే మీ ముందుకు వస్తాను అని చెప్పమన్నాడు. వచ్చే ఏడాది హిట్ కొట్టి మీ ముందుకు వస్తాడు” అంటూ నాగార్జున ఫ్యాన్స్ను ఉద్దేశించి చెప్పారు. అఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అధికారికంగా ఒక లుక్ ను సైతం విడుదల చేయలేదు. వచ్చే ఏడాది లో సినిమాకు సంబంధించిన ప్రకటన చేసి ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.