Andhra Pradesh
CM Chandrababu On TTD Declaration :ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే

ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు – CM Chandrababu On TTD Declaration
CM Chandrababu Naidu On TTD Declaration: శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని,భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, శ్రీవారి సన్నిధికి వెళ్లేవారంతా ఆలయ నియమాలు పాటించాలని కోరుతున్నానన్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నానంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమైందని అన్నారు.
ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమన్నారు. ఏడు కొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధతో స్వామివారిని కొలుస్తారని అన్నారు.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తేల్చిచెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు.