Business
అన్ని అమెజాన్ మీటింగ్స్ లో ఒక ఖాళీ కుర్చీ ఉంటుంది..

అమెజాన్ వ్యవస్థాపకుడు, మాజీ సిఇఒ జెఫ్ బెజోస్ (60) తను పాల్గొనే సమావేశం లేదా కంపెనీకి సంబంధించిన అన్న ముఖ్యమైన మీటింగ్ ల్లో ఒక ఖాళీ కుర్చీ కూడా ఉండాలని చెబుతారట. ఆ ఖాళీ కుర్చీ అత్యంత ముఖ్యమైన ఒక వ్యక్తి కోసమని, ఆ వ్యక్తే తమ ‘కస్టమర్’ అని చెబుతారట. కంపెనీ తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఎండ్ కస్టమర్ ను దృష్టిలో పెట్టుకోవాలన్న విషయం గుర్తుండాలన్న ఉద్దేశంతో జెఫ్ బెజోస్ అలా చేస్తారట. ఈ విషయాన్ని అమెజాన్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. జెఫ్ బెజోస్ తీసుకున్న మరికొన్ని అసాధారణ నిర్ణయాల గురించి తెలుసుకుందాం..
‘ఖాళీ కుర్చీ సిద్ధాంతం’
కంపెనీ సమావేశాల్లో కస్టమర్ కోసం ప్రత్యేకంగా ఒక ఖాళీ కుర్చీని ఉంచడాన్ని ఎంప్టీ చెయిర్ థీయరీ (‘Empty Chair Theory’) అంటున్నారు. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు కంపెనీకి “అత్యంత ముఖ్యమైన వ్యక్తి” అయిన కస్టమర్ కు ప్రాతినిధ్యం వహించడానికి అన్ని సమావేశాలలో ఒక ఖాళీ కుర్చీని అందుబాటులో ఉంచడాన్ని అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రారంభించారు. 2018 నుంచి ఈ విధానాన్ని ఆయన ప్రారంభించారు.
‘టూ పిజ్జా రూల్’
అమెజాన్ సమావేశాల్లో జెఫ్ బెజోస్ ప్రారంభించిన మరో నిబంధన టూ పిజ్జా రూల్ (‘Two Pizza Rule’). అమెజాన్ ను స్థాపించిన 1994 నుంచీ ఈ రూల్ ను ఫాలో అవుతున్నారు. కంపెనీలోని ప్రతీ టీమ్ లో 10 మంది కంటే తక్కువ మంది ఉండాలన్నది ఆ రూల్. అంటే ఆ టీమ్ రెండు పిజ్జాలను పంచుకునేంత చిన్నదిగా ఉండాలని జెఫ్ బెజెస్ ఉద్దేశం. ఒక టీమ్ లో ఎక్కువ మంది ఉంటే రిజల్ట్ సరిగ్గా రాదని, అందువల్ల నిర్ణయం తీసుకునే సమయంలో బ్యూరోక్రసీ ఓవర్ హెడ్స్ కనిష్ట స్థాయికి తగ్గించాలని జెఫ్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.