Connect with us

Andhra Pradesh

ఏపీలో పింఛన్ డబ్బులు అకౌంట్లలో వేస్తారు.. దీని వెనుక కారణం చెప్పారు.

ఏపీలో పింఛన్ డబ్బులు అకౌంట్లలో వేస్తారు.. దీని వెనుక కారణం చెప్పారు.

ఏపీ ప్రభుత్వం పింఛన్లలో కొన్ని మార్పులు చేసింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న విద్యార్థులు తమ ఊరికి దూరంగా చదువుకుంటున్నారు. ప్రతినెలా పింఛన్ తీసుకోవడానికి వారు పాఠశాల లేదా కళాశాలలకు సెలవు పెట్టి ఊరికి రావాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, వారి బ్యాంకు అకౌంట్‌లలోనే పింఛన్ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా, మూడో నెలలో కలిపి తీసుకునే అవకాశం కల్పించింది. ఈ విధానం డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఊరట ఇచ్చింది. వారు పింఛన్ కోసం దూరం నుంచి ఊరికి రావాల్సిన అవసరం లేకుండా, డబ్బులను వారి బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని నిర్ణయించింది.

ఇకపై దివ్యాంగ విద్యార్థులు పింఛన్ కోసం ఇంటికి రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. గురుకులాలు లేదా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా పింఛన్ డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్‌లలో జమ చేయనుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పింఛన్ డబ్బులు పొందేందుకు, తమ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అకౌంట్‌లో డబ్బులు జమ చేయడానికి సమ్మతి ఇవ్వాలి.

నవంబర్ నెల నుంచి దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పింఛన్ డబ్బులు పొందే అవకాశం కల్పించారు. అయితే, చాలా మంది దీనిపై అవగాహన లేక సచివాలయాల్లో దరఖాస్తు చేయలేదు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. విద్యార్థులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, వెల్ఫేర్ అసిస్టెంట్‌కు స్టడీ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, పింఛన్ ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇవ్వాలి. ఈ దరఖాస్తు ఎంపీడీవో కార్యాలయం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపబడుతుంది. అక్కడ వారి లాగిన్ ద్వారా డీబీటీ ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత ప్రతినెలా పింఛన్ డబ్బులు నేరుగా వారి బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతాయి. అందుకే విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ తీసుకునేవారు మరణిస్తే, వారి భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదాహరణకు, పింఛనుదారుడు నవంబర్ 1 తర్వాత మరణిస్తే, నవంబర్ 15 లోపు మరణ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామ/వార్డు సచివాలయానికి లేదా ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, డిసెంబర్ 1, 2024 నుంచి వితంతు పింఛన్ అందుతుందంటున్నారు. కానీ, డిసెంబర్ 15 తర్వాత పత్రం అందజేస్తే, జనవరి 1, 2025 నుంచి పింఛన్ మంజూరు చేస్తారు.

Loading