Andhra Pradesh

రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటన, వైసీపీ నేత అరెస్ట్

అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాళ్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఈ ఘటనపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథ మండపంలోని రథానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

రథ మండపం తాళాలను పగులగొట్టి రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. మంటలను గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రథం ముందు భాగం కాలిపోయింది. ఈ ఘటనపై కనేకల్ పోలీసు స్టేషన్ లో ఈ నెల 24న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, క్ల్యూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. అంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ నేరస్థలాన్ని పరిశీలించాయి.

పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. హనకనహాల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి అన్నదమ్ములు సుమారుగా రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారు. ఈ రథం తయారుచేసే సమయంలో ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని ఎవరిని వద్ద చందాలు తీసుకోకుండా స్వయంగా తయారు చేయించారు. దీంతో గ్రామస్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా మరో వర్గం రథాన్ని నిప్పు పెట్టింది.

ఇవాళ ఉదయం 6.00 గంటలకు పోలీసులు వైసీపీకి చెందిన బొడిమల్ల ఈశ్వర రెడ్డి(35)ను అరెస్టు చేశారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ముద్దాయి బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్ కస్టడీ కి తీసుకొని ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అని విచారణ చేస్తామన్నారు. ఎస్పీ పి. జగదీశ్ సూచనలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ జగదీశ్ అభినందించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version