Andhra Pradesh
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతారవణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు సెప్టెంబర్ 23 నుంచి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి బికనీర్, గుణ, మాండ్లా, రాజ్ నంద్ గావ్, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
తూర్పు పశ్చిమ షియర్ జోన్ తో అనుసంధానం అయ్యి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర థాయ్ లాండ్, పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాలు ప్రభావంతో, సెప్టెంబర్ 23 నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో ఎల్లుండి(సెప్టెంబర్ 23) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సెప్టెంబర్ 22 :
మన్యం,అల్లూరి,ఏలూరు,ఎన్టీఆర్, పల్నాడు,ప్రకాశం,కర్నూలు,నంద్యాల, అనంతపురం,శ్రీసత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూగో,పగో,కృష్ణా,గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.