Connect with us

Telangana

సొంతగూటికి వచ్చిన మాజీ మంత్రి.. టీడీపీలో చేరిన బాబు మోహన్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నేతలు తమకు కలిసొచ్చే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలానే కీలక నేతలు కూడా ఎమ్మెల్యేల బాటలోనే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటంతో తెలంగాణలో ఆ పార్టీ వైపు కూడా కొందరు నేతలు మెుగ్గు చూపుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

తాజాగా మాజీమంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ టీడీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను బాబు మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో బాబు మోహన్ మంత్రిగా పని చేయగా.. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పసుపు పార్టీ అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అడ్‌హక్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్ ఆ పార్టీలో చేరినట్లు ప్రకటించారు.

అయితే ప్రముఖ కమీడియన్ బాబు మోహన్ తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999 నుంచి 2024 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ కేబినెట్‌లో ఆయన మంత్రిగా పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీజేపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఆ తర్వాత వరంగల్ MP స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా అది కుదరలేదు. ఆ తర్వాత కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి.. కానీ వాటిని ఖండించారు. తాజాగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు బాబు మోహన్ వెల్లడించారు.

Loading