Latest Updates
మంగ్లీ బర్త్డే పార్టీ కేసు: సింగర్ స్పందన, DGP వివరణ
ప్రముఖ తెలుగు గాయని మంగ్లీ తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కేసుపై స్పందించారు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఈ వేడుకల్లో అనుమతి లేకుండా మద్యం సరఫరా, సౌండ్ సిస్టమ్ వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మంగ్లీ స్పష్టత ఇస్తూ, “లిక్కర్ మరియు సౌండ్ సిస్టమ్కు పర్మిషన్ తీసుకోవాలనే విషయం నాకు తెలియదు. తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు,” అని తెలిపారు.
ఈ ఘటనపై రాజేంద్రనగర్ DGP వివరణ ఇస్తూ, “పార్టీ నిర్వహణకు అవసరమైన అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేయడం జరిగింది. దామోదర్ అనే వ్యక్తి గంజాయి వినియోగించినట్లు తేలింది, అయితే అతను ఆ పదార్థాన్ని వేరే చోట నుంచి తీసుకున్నట్లు సమాచారం ఉంది. వేడుకల్లో మత్తు పదార్థాలు లభించలేదు, కానీ విదేశీ మద్యం సీజ్ చేశాం,” అని పేర్కొన్నారు.
పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు. మంగ్లీతో పాటు రిసార్ట్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.