Latest Updates
మూసాపేటలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి ఘనంగా నిర్వహణ దళిత సమాజానికి చేసిన సేవలు స్మరించిన నేతలు
హైదరాబాద్, మూసాపేట:
దళిత చైతన్యానికి, సామాజిక న్యాయ సాధనకు అంకితమైన ప్రముఖ సమాజ సేవకులు మాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి సందర్భంగా గురువారం మూసాపేటలోని అంబేడ్కర్ నగర్ గూడ్స్ షెడ్ రోడ్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు. దళితుల హక్కుల కోసం భాగ్యరెడ్డి వర్మ తీసుకున్న ఉద్యమాలు, ఆయన రచనలు, సమాజంలోని అణగారిన వర్గాలను చైతన్య పరచడానికి చేసిన కృషి గురించి ప్రసంగాల్లో విస్తృతంగా ప్రస్తావించారు.
వర్మ సేవలను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి: కర్క నాగరాజు డిమాండ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువజన సంఘం నేత కర్క నాగరాజు మాట్లాడుతూ, “భాగ్యరెడ్డి వర్మ గారు మన దేశంలో తొలి బాలికా పాఠశాలలు స్థాపించి విద్యకు గౌరవం తీసుకొచ్చారు. బాలల వివాహాలు, అనాథల విషయంలో చేసిన సేవలు అద్భుతం. ఇటువంటి మహనీయుల జీవిత చరిత్రను యువతకు తెలియజెయ్యాలంటే తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్రను చేర్చడం తప్పనిసరి” అని అన్నారు.
సామాజిక సమానత్వానికి వర్మ మార్గదర్శి
ప్రజాస్వామ్యంలో సమానత్వం కోసం పోరాడిన భాగ్యరెడ్డి వర్మ జీవితానుభవాలు నేటి సమాజానికి ఎంతో ప్రాసంగికమని, యువతలో చైతన్యం కలిగించడానికి ఆయన బాటలను అనుసరించడం అవసరమని నాయకులు పేర్కొన్నారు. ఆయన అభ్యుదయ ఆలోచనలు, హిందూ ధర్మంలో ఉన్న కులవివక్షపై చేసిన విమర్శలు, సామాజిక సమరసతకు చేసిన కృషి గురించి కార్యకర్తలు ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో పలువురు యువ నాయకులు, సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వారు భాగ్యరెడ్డి వర్మ భావజాలాన్ని సామాజిక రగడల నివారణకు ఉపయుక్తంగా వినియోగించుకోవాలని సంకల్పం తీసుకున్నారు.