National
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. బిహార్లోనూ అదే జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపణ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఈ ఏడాది జరగనున్న బిహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా కుట్రలు పునరావృతమవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు, ఫేక్ ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచినట్లు చూపించడం, బీజేపీకి అనుకూలమైన ప్రాంతాల్లో బోగస్ ఓట్లు వేయించడం వంటి చర్యల ద్వారా ఎన్నికల ప్రక్రియను మ్యాచ్ ఫిక్సింగ్లా మార్చారని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇలాంటి కుట్రలతో ఎన్నికల్లో గెలవడం సాధ్యమైనప్పటికీ, ఇది దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఈ రకమైన చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, దీర్ఘకాలంలో రాజకీయ వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన అక్రమాలను బయటపెట్టడంతో పాటు, బిహార్ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పారదర్శకమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.