Latest Updates
నీటి వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్తో నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చర్చలకు ఆహ్వానించేందుకు తాను స్వయంగా ముందుకు వస్తానని రేవంత్ తెలిపారు.
“నీటి వివాదాలను పరిష్కరించేందుకు వరుసగా నాలుగు రోజుల పాటు చర్చలకు కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను,” అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “చంద్రబాబు నాయుడు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలి. అలాగే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నా అవే నీళ్లు అవసరం. అందుకే ఈ నీటి వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి,” అని పేర్కొన్నారు.
నీటి వివాదాలను రాజకీయంగా వాడుకోకుండా, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలన్నది తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.