News

చేవెళ్ల బస్సు ప్రమాదంపై హెచ్ఆర్సీ దృష్టి — డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు

చేవెళ్ల బస్సు ప్రమాదం తెలంగాణ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్జాగూడ గేట్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్‌ బస్సును ఢీకొట్టి దానిపైనే ఒరిగిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సులో కూర్చున్న ప్రయాణికులు కంకర కింద చిక్కుకుని ఊపిరాడక మరణించారు.

ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించేందుకు రవాణా, హోం, భూగర్భ గనుల శాఖలతో పాటు రంగారెడ్డి కలెక్టర్‌, ఆర్టీసీ ఎండీ, జాతీయ రహదారి అధికారులను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదికను డిసెంబర్ 15లోపు సమర్పించాలని హెచ్ఆర్సీ గడువు విధించింది.

తాండూరు నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మీర్జాగూడ వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. బస్సు పూర్తిగా ధ్వంసమైపోగా, కుడివైపున కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. బస్సు డ్రైవర్‌తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా ఘటన స్థలంలోనే మృతి చెందారు.

మృతుల్లో 12 మంది మహిళలు, 6 మంది పురుషులు మరియు ఒక 10 నెలల శిశువు ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రమాద కారణాలను గుర్తించేందుకు సంబంధిత శాఖలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version