Politics
క్యాతనపల్లిలో రాజకీయ రణరంగం: మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్పై రాళ్ల దాడి!
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీల వాహనాలపై నిరసనకారులు రాళ్లతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ మద్దతుదారులు జరిపిన ఈ దాడిలో మంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.పరిస్థితి విషమించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు.
ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఇతర ప్రాంతాల్లోనూ సెగ,కేవలం క్యాతనపల్లిలోనే కాకుండా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా ఇరు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కుర్చీలు విసురుకోవడంతో అక్కడ కూడా రసాభాస చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.
![]()
