Andhra Pradesh
ఇక టోల్ వద్ద ఆగక్కర్లేదు: ఏపీలో ‘మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్.. ఆ రెండు చోట్ల పైలట్ ప్రాజెక్ట్!
హైవేలపై ప్రయాణం మరింత వేగంగా, సులభంగా మారబోతోంది. టోల్ప్లాజాల వద్ద ఉండే బారియర్లు, టోల్ బూత్ల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో, వాహనాలు ఆగకుండానే టోల్ వసూలు చేసే ఎమ్ఎల్ఎఫ్ఎఫ్ (మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
ఈ కొత్త విధానంలో టోల్ వద్ద గేట్లు లేదా బారియర్లు ఉండవు. వాహనం వేగంగా వెళ్తున్నప్పుడే టోల్ కట్ అవుతుంది,టోల్ప్లాజా పైన అమర్చిన ANPR (ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) కెమెరాలు నంబర్ ప్లేట్ను గుర్తిస్తాయి. శాటిలైట్ GPS మరియు RFID రీడర్లు ఫాస్టాగ్ నుండి ఆటోమేటిక్గా నగదును డెబిట్ చేస్తాయి. విజయవాడ – గుంటూరు మధ్య ఉన్న కాజ టోల్ ప్లాజా, విజయవాడ బైపాస్లోని వెంకటపాలెం టోల్ ప్లాజాలలో ఈ విధానాన్ని మొదటగా అమలు చేయనున్నారు,ఒకవేళ ఫాస్టాగ్ లేకపోతే వాహనాల కోసం ప్రత్యేకంగా ఒక లైన్ ఉంటుంది. అక్కడ QR కోడ్ ద్వారా చెల్లించవచ్చు, కానీ సాధారణ ఫీజు కంటే 25 శాతం అదనంగా కట్టాల్సి ఉంటుంది.
NHAI మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్ ఇన్విట్’ పేరుతో సామాన్య ప్రజలు కూడా హైవే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తోంది. విజయవాడ – చిలకలూరిపేట మధ్య ఉన్న 69.4 కిలోమీటర్ల హైవే సెక్షన్లో ఈ పెట్టుబడి పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం – అనకాపల్లి సెక్షన్లలో ఈ విధానం అమల్లో ఉంది.
![]()
