National
గల్ఫ్ అట్టుడుకుతోంది: సౌదీ ‘ఆరాంకో’ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి.. ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న చమురు ధరలు!

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన ప్రతీకార పర్వాన్ని మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా అనుకూల దేశాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది,ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి చేయడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు క్షేత్రాల్లో ఒకటైన రాస్ తనురా (ఆరాంకో) రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడ రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి అవుతుంది.కువైట్ గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్-15 (F-15) యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఇందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇరాన్ దాడి వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపమా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రతా కారణాలతో యజమానులు రవాణాను నిలిపివేయడంతో ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్లకు చేరుకుంది, శనివారం అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ, రక్షణ మంత్రి మరణించడంతో ఇరాన్ రగిలిపోతోంది. సౌదీ, కువైట్, యూఏఈ సహా 10 దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది,ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, చమురు సంక్షోభం తలెత్తవచ్చని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.