Entertainment

క్రేజీ కాంబో.. యంగ్ హీరోతో కలిసి రవితేజ మల్టీస్టారర్, తెరపై నవ్వుల పండగే

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కథను బెజవాడ ప్రసన్నకుమార్ అందించగా, ఆయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఇద్దరు హీరోలకు కథ వినిపించగా, రవితేజ మరియు నవీన్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మాస్ ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్‌తో రవితేజ ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఎనర్జీ అందిస్తుంటారు. ఆయన నటించిన ‘కిక్’, ‘బెంగాల్ టైగర్’, ‘క్రాక్’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇక నవీన్ పోలిశెట్టి తన యూనిక్ కామెడీ స్టైల్‌, స్మార్ట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎనర్జిటిక్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో భారీ ఎక్సయిట్మెంట్ కలిగిస్తోంది.

బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన కథ రవితేజను బాగా ఆకట్టుకుందని, ఇందులో రెండో హీరో పాత్రకు నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌ ఫిక్స్ అయితే తెరపై నవ్వుల పండగ తప్పదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు కూడా ఈ మాస్ అండ్ కామెడీ కాంబినేషన్‌పై ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

ఇక రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులో శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది. మరోవైపు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత వీరి మల్టీస్టారర్ అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version