Latest Updates

ఆటో రిక్షా కోసం ఫ్రెండ్స్‌తో క్రాకర్స్ ఛాలెంజ్.. చివరకు ఊహించని ఘటన..!

స్నేహితులతో చేసిన ఛాలెంజ్‌కు ఓ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. ఒక స్టీల్ బాక్స్‌లో టపాసులు పెట్టి, దానిపై కూర్చున్న వారికి ఆటో రిక్షా కొనిస్తామని స్నేహితులు పందెం కాశారు. దీంతో ఒక వ్యక్తి తాను కూర్చుంటానని సవాల్ స్వీకరించి, చివరకు మృత్యువు ఒడిలో పడాడ్డు. బెంగళూరులో దీపావళి రోజున చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రాగా.. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటన బెంగుళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోననకుంటె వీవర్స్ కాలనీకి చెందిన యువకులు దీపావళి రోజున బాణాసంచా కాల్చుతూ.. పందెం వేసుకున్నారు. స్టీల్ బాక్స్‌ కింద టపాసులు పెట్టి.. దానిపైన కూర్చున్న వారికి ఆటో రిక్షా కొనిస్తామని చెప్పారు. దీనికి శబరీష్ (32) అనే యువకుడు సరేనన్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడు టపాసుల బాక్సుపై కూర్చుగా.. వాటికి నిప్పంటించడంతో అవి పేలి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో  అతడ్ని వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం (అంటే నవంబరు 2న) చనిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యువకులంతా ఆ సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

కేసు నమోదుచేసి.. ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

 

వైరల్ అవుతోన్న వీడియోలో ముందుగా టపాసులు పెట్టిన స్టీల్ బాక్సుపై శబరీష్ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అతడి చుట్టూ స్నేహితులు కొంచెం దూరంగా నిలబడ్డారు. ఓ యువకుడు వాటిని వెలిగించిన తర్వాత వారంతా దూరంగా వెళ్లిపోయారు. కొంత సేపటి తర్వాత అవి పేలడంతో చుట్టూ పొగలు కమ్ముకోగా.. శబరీష్ తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడికి అంతర్గత అవయవాల్లో గాయాలైనట్టు వైద్య నివేదికలు తెలిపాయి. పండగ వేళ ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version