Entertainment
DEVARA MOVIE REVIEW : ఎర్ర సముద్రం పోటెత్తింది!

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రివ్యూ – ఎర్ర సముద్రం పోటెత్తింది! – DEVARA MOVIE REVIEW
NTR Koratala Siva Devara Review : ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం దేవర : పార్ట్1 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా?
ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన చిత్రం దేవర. జాన్వీ కపూర్ ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రమిది. పైగా ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్తో ఎన్టీఆర్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇలా ఇవన్నీ కలిసి రావడంతో దేవరపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి నేడు(సెప్టెంబర్ 27) థియేటర్లలోకి వచ్చిన దేవర ఆ అంచనాలను అందుకుందా? ఫ్యాన్స్ను కాలర్ ఎగరేసుకునేలా చేసిందా? ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మెప్పించిందా? అసలు ఈ సినిమా కథేంటి? థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఏం అంటున్నారు? కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథేంటంటే?(Devara Story) : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో రత్నగిరి అనే ప్రాంతం ఉంటుంది. అక్కడే సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. ఆ పేరు వెనక బ్రిటీష్ కాలం నుంచే ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల ప్రజల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) తమ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రంపై ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు.
అయితే ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేస్తుంటుంది మురుగ (మురళీశర్మ) గ్యాంగ్. అయితే ఇలా అక్రమంగా దిగుమతి చేసే ఆయుధాల వల్ల తమకే ముప్పు కలిగిస్తుందని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయిస్తాడు. చేపలు పట్టడంపై దృష్టి పెడదామని ఆదేశిస్తాడు.
కానీ భైరకు అది ఇష్టం ఉండదు. దీంతో ఈ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం ప్రారంభం అవుతుంది. దీంతో దేవరను అడ్డు తొలగించి సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైర. కానీ దేవర మాత్రం అజ్ఞాతంలో ఉంటూ ప్రత్యర్థులను భయపడేలా చేస్తుంటాడు.
మరి ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? దేవర ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు? దేవర కోసం అతని కొడుకు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? వరని ఇష్టపడిన తంగం (జాన్వీకపూర్) ఎవరు? వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?(Devara Review) – ‘దేవర’ కొసం ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఆ ప్రపంచం చుట్టూ భావోద్వేగాలు, గాఢతతో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ దీటైన పాత్రను ఎంచుకుని, దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించారు. పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. సముద్రం నేపథ్యంలో సాగే కథ కావడంతో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడి ప్రజలకు ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథను సింగప్ప(ప్రకాశ్రాజ్)తో చెప్పిస్తూ కథను అద్భుతంగా నడిపించారు. నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఎలివేషన్స్, సముద్రం బ్యాక్డ్రాప్ గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. దేవర, భైర ఆ రెండు పాత్రల్ని అత్యంత శక్తిమంతంగా తెరపై ఆవిష్కరించారు. ఇద్దరి మధ్య సాగే భీకర పోరాటం, సహా ఇతర సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ఫియర్ సాంగ్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ మరో స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా ఫస్ట్ హాఫ్లో ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఇలా అన్ని సూపర్గా ఉన్నాయి.
సెకండాఫ్లో వర, తంగం పాత్రల సందడి కనిపిస్తుంది. సరదా సరదాగా సాగే కొన్ని సన్నివేశాలు, ఆ తర్వాత మళ్లీ దేవర పాత్రను చూపిస్తూ కథలో గాఢతను పెంచుతారు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త తక్కువే. క్లైమాక్స్లో వచ్చే మలుపు ఊహించిందే అయినా, దానికి కొనసాగింపుగా సాగే పోరాట ఘట్టాలు, సముద్రంలో దేవర పాత్రను చూపించిన తీరు బాగా ఆకట్టుకున్నాయి. ఫైనల్గా దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం దాచి పెట్టారు.