Andhra Pradesh

ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం గురించి కీలక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి మొన్న శ్రీకారం చుట్టగా.. ఇక మిగిలిన పథకాలపైనా కూడా కసరత్తు చేస్తోంది. ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరో అద్భుతమైన పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని ఆగస్టు 15కి ప్రారంభిస్తారని భావించారు.. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి BC జనార్థన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు మంత్రి. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో మహిళలు ఆనందంలో ఉన్నారన్నారు.

తల్లికి చెల్లికి న్యాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు.. చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడే అర్హత అసలు లేదన్నారు బీసీ జనార్థన్ రెడ్డి. జగన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రస్తుతం జనాలు నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని.. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి చెప్పిన పథకాల్లో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చింది. ఈ పథకంపై ఫోకస్ పెట్టి.. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తారని అప్పట్లో ప్రచారం చేసారు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు సంక్రాంతికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ప్రభుత్వం.. ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో ఆర్టీసీ అధికారులు పర్యటించారు.. అక్కడ పథకం అమలవుతున్న తీరును జాగ్రత్తగా పరిశీలించారు. ఈ మేరకు నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అయితే ప్రభుత్వం కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తోంది.. అన్ని డిపోల్లో అవసరం మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version