Business
సోలార్ షాక్: భారత్పై 126 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. కుదేలైన సోలార్ స్టాక్స్!

భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇటీవల భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ మరియు సెల్స్ ఎగుమతులపై ఏకంగా 126 శాతం దిగుమతి సుంకాలను (Import Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
భారత ప్రభుత్వం సోలార్ తయారీ రంగానికి భారీగా సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయని అమెరికా వాణిజ్య విభాగం వాదిస్తోంది.అమెరికాలో స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు విదేశీ ఉత్పత్తుల ధరలను పెంచడం ద్వారా దిగుమతులను అడ్డుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. భారత్తో పాటు ఇండోనేసియాపై 143 శాతం, లావోస్పై 81 శాతం,ఇతర దేశాల సుంకాలను పెంచారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు సోలార్ ఉత్పత్తులను ఎగుమతి చేసే భారతీయ దిగ్గజాలపై గట్టి దెబ్బ తీసింది. బుధవారం (ఫిబ్రవరి 25) స్టాక్ మార్కెట్ సెషన్లో సోలార్ రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి.వారీ ఎనర్జీస్ ,విక్రమ్ సోలార్,ప్రీమియర్ ఎనర్జీస్ ఈ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 10 శాతం వరకు కుదేలయ్యాయి.అమెరికా సుప్రీంకోర్టు గతంలో ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసినప్పటికీ, ఆయన మళ్ళీ కొత్త రూపంలో భారత్ను టార్గెట్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనివల్ల అమెరికాలోని వినియోగదారులు కూడా సోలార్ ఉత్పత్తుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు.