Telangana

తెలంగాణ మహిళలకు శుభవార్త – నవంబర్‌ 19నుంచి ఉచిత చీరల పంపిణీ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమ దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన ఉచిత చీరలను ఇప్పుడు “ఇందిరా మహిళా శక్తి” పథకం కింద నవంబర్‌ 19న, భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయనుంది. పండుగ సమయానికి చీరల తయారీ పూర్తి కాకపోవడంతో వాయిదా పడిన ఈ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది.

ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నవంబర్‌ 15లోపు చీరల తయారీ పూర్తిచేసి జిల్లాలకు పంపిణీ చేయాలని సూచనలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 18,848 స్వయం సహాయక బృందాల్లో ఉన్న 1.94 లక్షల మంది మహిళలకు ఒక్కొక్క చీర చొప్పున అందించనున్నారు. ప్రస్తుతం సుమారు 50 శాతం చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరగా, మిగతావి త్వరలో సరఫరా కానున్నాయి.

చీరల తయారీ పూర్తిగా తెలంగాణ చేనేత పరిశ్రమల ద్వారానే జరుగుతోంది. సిరిసిల్ల, వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాల మగ్గాలపై తయారైన ఈ చీరలు నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో చీర సుమారు రూ.800 విలువ గలదిగా అంచనా వేయబడింది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సంస్థల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చీరల నాణ్యతపై వచ్చిన విమర్శల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మరింత మెరుగైన నాణ్యతతో చీరలను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ఈసారి మహిళలకు పండుగ వాతావరణంలో సంతోషం నింపే విధంగా ఉచిత చీరల పంపిణీ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version