Andhra Pradesh
ఇందులో నా తప్పులేదు: నిధి అగర్వాల్
భీమవరం లో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నటి నిధి అగర్వాల్కి సంబంధించి ఒక వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమానికి ఆమె ప్రయాణించిన వాహనం ప్రభుత్వానికి చెందినదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు, నెటిజన్లలో చర్చ మొదలైంది. ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత కార్యక్రమానికి ఉపయోగించారనే విమర్శలు రావడంతో ఈ విషయం పెద్దదిగా మారింది.
ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పష్టీకరణ ఇచ్చారు. భీమవరం ఈవెంట్కు తాను వెళ్లినప్పుడు, స్థానిక నిర్వాహకులు తన కోసం కారును ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ వాహనం ప్రభుత్వానికి చెందినదని తనకు తెలియలేదని, పూర్తిగా నిర్వాహకులే అన్ని ఏర్పాట్లు చేశారని ఆమె చెప్పారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఈ విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
అలాగే, “ప్రభుత్వమే నాకోసం వాహనం ఇచ్చిందని కొన్ని వర్గాలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఇది పూర్తిగా అసత్యం. అభిమానులు ఈ రకమైన పుకార్లను నమ్మకండి” అని నిధి అగర్వాల్ అన్నారు. ఈ వివాదంపై ఆమె చేసిన ఈ క్లారిటీతో, సోషల్ మీడియాలో కొనసాగుతున్న విమర్శలకు కొంత ముగింపు లభించింది.