Business

Quick Commerce: రేసులోకి అంబానీ – 3 నెలల్లో 58 లక్షల కొత్త కస్టమర్లు జోడించిన జియోమార్ట్

క్విక్ కామర్స్ రంగంలో ఇప్పటివరకు జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోమార్ట్ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. తనకు ఉన్న రిటైల్ బలం, విస్తృత నెట్‌వర్క్‌తో కేవలం మూడు నెలల్లోనే 58 లక్షల కొత్త కస్టమర్లను పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న 3 వేల రిటైల్ స్టోర్స్, 600 డార్క్ స్టోర్స్ ద్వారా జియోమార్ట్ డెలివరీ నెట్‌వర్క్‌ను బలపరిచింది.

రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ వ్యూహం ఇతర కంపెనీలకంటే భిన్నంగా ఉంది. 3 వేలకుపైగా ఉన్న తమ స్టోర్లను హైపర్‌లొకల్ హబ్స్‌గా మార్చి, 5 వేల పిన్‌కోడ్స్‌లో సేవలను విస్తరించింది. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులు ఇలా పలు విభాగాల్లో వేగంగా డెలివరీ సేవలు అందిస్తోంది. డెలివరీ సమయం మొదట్లో 60-90 నిమిషాలుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు దాన్ని 30 నిమిషాలకు తగ్గించడం కంపెనీ పోటీదారులపై ఒత్తిడి పెంచుతోంది.

భారత క్విక్ కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.64 వేల కోట్లుగా ఉంది. 2028-29 నాటికి ఇది రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ విస్తృతమైన మార్కెట్‌లో రిలయన్స్ వాటా గణనీయంగా పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. తన డెలివరీ మౌలిక వసతులు, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, వినియోగదారుల నమ్మకం కలిపి జియోమార్ట్‌ను అత్యంత వేగంగా పెరుగుతున్న ప్లాట్‌ఫారంగా నిలబెట్టాయి.

క్విక్ కామర్స్ రంగం రోజురోజుకీ వేగంగా మారుతోంది. వినియోగదారులు ఇప్పుడు వేగం, విశ్వసనీయత, మరియు సరసమైన ధరల కోసం చూస్తున్నారు. ఈ అవసరాలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందించడంలో జియోమార్ట్ ముందంజలో ఉంది. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చకపోతే, అంబానీ క్విక్ కామర్స్ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version