Sports

ఆఖరి రోజు అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 95 రన్స్..!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచులో గెలవాలంటే.. తప్పక వికెట్లు తీయాల్సిన పరిస్థితిలో అసాధారణ ప్రదర్శన చేశారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టును 146 పరుగులకే కుప్పకూల్చారు. ఓవర్ నైట్ స్కోరు 26/2తో ఐదో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 120 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 95 పరుగుల లక్ష్యం నిలిచింది.

కాగా ఓవర్ నైట్ స్కోరు 26/2తో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కాసేపటికే వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మొమినుల్ హక్.. 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి కేఎల్ రాహుల్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత నజ్ములు హుసేన్ శాంటో (19)తో కలిసి ఓపెన్ రస్ షాద్మన్ ఇస్లాం (50) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. దీంతో ఓ దశలో బంగ్లాదేశ్ 91/3తో నిలిచింది. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ వేశాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజాను రంగంలోకి దింపాడు. తాను వేసిన రెండో బంతికే శాంటోను ఔట్ చేసిన జడ్డూ.. 55 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

ఇక శాంటో ఔట్ అయిన తర్వాత బంగ్లాదేశ్ వికెట్ల గేట్లు ఎత్తేసింది. భారత బౌలర్ల దెబ్బకు వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు పతనం వేగంగా సాగింది. చివరకు బంగ్లాదేశ్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 3, జస్‌ప్రీత్ బుమ్రా 3, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు.

ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్.. 285/9 స్కోరు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 52 పరుగుల లీడ్ లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 95 పరుగుల లక్ష్యం నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version