News

రాజ్యసభ రేసు: కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు పూర్తి.. పోటీకి బీఆర్ఎస్ ససేమిరా!

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులెవరనే ఉత్కంఠకు తెరపడింది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కాంగ్రెస్ తరపున ఇద్దరు ప్రముఖులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు తమ నామపత్రాలను సమర్పించారు.

కాంగ్రెస్ జాతీయ నేత, ప్రముఖ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ హైకమాండ్ మరోసారి అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి రెండోసారి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి రెండో స్థానాన్ని కేటాయించారు. ఆయన తన సలహాదారు పదవికి రాజీనామా చేసి ఈ బరిలో నిలిచారు.

బీఆర్ఎస్ సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో పోటీకి దిగి అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఎందుకని భావించిన గులాబీ పార్టీ, అభ్యర్థులను ప్రకటించలేదు.ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ, నిబంధనల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది.మార్చి 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మార్చి 9వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఒకవేళ అవసరమైతే మార్చి 16న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.ఈ గెలుపుతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం పెరగడమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పట్టు మరోసారి నిరూపితమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version