Andhra Pradesh

ప్రకృతి వైద్యానికి పెద్ద పీఠ.. మంతెన సత్యనారాయణరాజుకు ప్రభుత్వ పదవి

కూటమి ప్రభుత్వం డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైద్యానికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఆయనను కీలక సలహాదారు గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రాంతంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసమైన కరకట్ట సమీపంలో ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసి ఏళ్లుగా సేవలు అందిస్తున్న మంతెన సేవలను ప్రభుత్వం గుర్తించింది. మందులపై ఆధారపడకుండా, జీవనశైలిలో మార్పుల ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని నిరూపిస్తూ ఆయన వేలాది మందికి ఆరోగ్యం అందించారు.

డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఉప్పు లేని, నూనె లేని ఆహార విధానం, యోగా, ఉపవాసాలు, నీరు, బురద, సూర్యకాంతి చికిత్సలతో రోగనిరోధక శక్తిని పెంచే విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. విజయవాడతో పాటు నర్సాపురం, అమరావతి ప్రాంతాల్లో ఆయన నిర్వహిస్తున్న ఆరోగ్యాలయాలు ఎంతో మందికి ఆశాజ్యోతి అయ్యాయి. ఈ కేంద్రాల్లో ఆయన భార్య డాక్టర్ విశా కూడా సహజ చికిత్సల ద్వారా సేవలు అందిస్తోంది.

చంద్రబాబు కుటుంబంతో పాటు టీడీపీ నేతలతో డాక్టర్ మంతెనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజారోగ్య విధానాల్లో ప్రకృతి వైద్యానికి ప్రాధాన్యం పెంచే దిశగా ఆయన సలహాలు కీలకంగా మారనున్నాయి. ప్రకృతి వైద్యంపై ప్రభుత్వ విధానాలకు మార్గదర్శనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం జరిగినట్లు సమాచారం.

కానీ, ఈ పదవికి సంబంధించిన జీతభత్యాలు, ఇతర సౌకర్యాలపై ప్రత్యేకంగా మరిన్ని ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నియామకంతో ప్రకృతి వైద్యానికి రాష్ట్ర స్థాయిలో మరింత ప్రోత్సాహం లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

#DrManthena#మంతెనసత్యనారాయణరాజు#ప్రకృతివైద్యం#Naturopathy#APGovernment#కూటమిప్రభుత్వం#ChandrababuNaidu
#PublicHealth#WellnessIndia#NaturalHealing#APPolitics#HealthAdviser#AndhraPradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version