Connect with us

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌.. దానిపై రోజా విమర్శలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,94,427.25 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బడ్జెట్ ద్వారా సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్.. ఇప్పుడు సూపర్ చీట్స్‌గా మారిపోయిందంటూ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా విమర్శలు చేసారు. తొలి బడ్జెట్‌లోనే చంద్రబాబు మోసం బయటపడిందంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు.

“19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల ఆడవాళ్లకు నెలకు రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18,000 ఇస్తామని బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా.. అలానే ఎన్నికల్లో గెలవగానే నిరుద్యోగులకు నెలకి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఇప్పుడు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దగా కాదా.. ఎన్నికల్లో గెలవగానే మహిళలకి ఉచిత బస్ పథకం అమలు చేస్తామన్నారు.. ఇప్పుడు ఆ పథకానికి నిధులే ఇవ్వలేదు! మోసం కాదా.. తల్లికి వందనం పథకానికి నిధులు సగానికి పైగా కోత పెట్టడం దగా కాదా..” అంటూ రోజా ప్రశ్నించారు.

“సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని.. ఈ సంవత్సరం మాత్రం 2 సిలిండర్లను ఎగ్గొట్టడం మోసం కాదా.. 50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తాం అన్నారు.. ఏది ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదే? రైతులకు 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తాం అన్నారు. 10 వేల కోట్లు ఇవ్వాల్సింది 4,500 కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా.? ఎన్నికల్లో ఓట్లెయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటింటికి మీరిచ్చిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కి గ్యారంటీ..బాండ్లను ఇప్పుడు ఏం చేసుకోవాలి.. ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలా.. సమాధానం చెప్పాలి” అంటూ రోజా డిమాండ్ చేశారు.

Loading

Trending