Connect with us

Telangana

పోలీసుల ముందు తల దువ్వుకున్నాడు.. గుండు కొట్టించిన ఎస్సై..

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు గుండు కొట్టించారన అవమాన భారంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకొని సూసైడ్‌కు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య యువకుడు కొట్టుమిట్టాడుతున్నాడు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం లింగాలలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు ముగ్గురు యవకులు బైకుపై వెళ్లారు. రూ.200 ఇచ్చి పెట్రోల్ పోయాలని అడిగారు. అయితే పెట్రోల్ కొట్టించే క్రమంలో బంక్ నిర్వహకులకు, యువకులకు గొడవ జరిగింది. యువకులు, బంక్ సిబ్బంది మాటా మాటా అనుకున్నారు. దీంతో బంక్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు యువకులను లింగాల ఎస్సై స్టేషన్‌కు పిలిపించాడు. గొడవ గురించి అడిగి తెలుసుకున్నాడు.

అయితే ఆ సమయంలో సతీష్ అనే యువకుడు తల దువ్వుకున్నాడు. ఈ చర్యతో ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నా ముందే తల దువ్వుకుంటావా..? అని సతీష్‌తో పాటుగా మరో ఇద్దరు యువకులకు ఎస్సై గుండు కొట్టించాడు. అనంతరం వారిని ఇంటికి పంపించాడు. ఎస్సై గుండు కొట్టించిన విషయం గ్రామంలో తెలిసింది. దీంతో యువకుడు సతీష్ మనస్థాపం చెందాడు. తనకు ఎస్సై గుండు కొట్టించినా.. ఎందుకు ప్రశ్నించలేదని ఇంట్లో తండ్రితో గొడవకు దిగాడు. కాలనీలో తనని చూసి ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనంతరం ఇంట్లోని తన గదికి వెళ్లి లోపల్నుంచి గడియ పెట్టుకున్నాడు. ఇక చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకోగా.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగులగొట్టి అతడిని కిందకు దించేశారు. కొన ఊరిపితో ఉండగా.. నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి అక్కడ చికిత్స అందుతోంది. అయితే ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్సై యువకులకు శిరోముండనం చేయించటం డిపార్ట్‌మెంట్‌లోనూ కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. పోలీసుల విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Loading

Advertisement

Trending