Connect with us

Andhra Pradesh

అమరావతికి శుభదినం.. కేంద్రం సమక్షంలో చర్చలు జరిగి, వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ADB)లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో.. ఆంధ్రప్రదేశ్ అధికారులు, సీఆర్డీఏ జరుపుతున్న చర్చలు సఫలం అయ్యాయి. ఈ చర్చలను కేంద్ర ఆర్థిక శాఖ సమన్వయం చేసింది. రుణానికి ఎంవోయూ మాత్రం జరగలేదు. అయితే, ఈ రుణం ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు పెట్టిన షరతులు, నిబంధనలను కేబినెట్ ముందు ప్రవేశపెడతారు. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు తుది ఆమోదం కోసం ఈ ఒప్పందాన్ని వారి సంబంధిత బోర్డులకు పంపిస్తాయి.

సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ రుణానికి సంబంధించిన ప్రతిపాదనల్ని సమర్పించారు. అలాగే వీటిని రుణాలు ఇచ్చే ఏజెన్సీలు పరిశీలించిన తర్వాత.. వారు లేవనెత్తిన సందేహాలు, సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ సీనియర్ అధికారులతో పాటుగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు.. అక్కడ స్థానికులతో, రైతులతో, కూలీలతో మాట్లాడారు. రాజధానిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. సీఆర్డీఏ సమర్పించిన పెద్ద నివేదికలను చూసిన తర్వాత, ప్రపంచ బ్యాంకు, ADB బృందాలు ఒప్పందంలోని వివిధ విషయాలను పరిశీలించి, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నగరం నిర్మించడానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. మొత్తం రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పారు.. ఈ మేరకు పనుల్ని చేపట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది. ప్రధానంగా రోడ్లు, డక్ట్‌లు, డ్రెయిన్‌లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్‌లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆలోచన చేస్తోంది. సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపగా, కేంద్ర ఆర్థిక శాఖ వాటిని అంగీకరించింది.

అక్కడి నుంచి ఈ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు దగ్గరకు పంపగా.. వారు కూడా ఆమోదించారు. ఈ విషయం మీద, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ఆర్థిక సాయం పొందడానికి ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారం ఇవ్వడాన్ని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి వచ్చే నిధుల కోసం ప్రత్యేకంగా అకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రూ.13,600 కోట్లు ఇస్తున్నాయి. ఇక, రూ.1,500 కోట్లను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. మొత్తం రూ.15,000 కోట్లు వచ్చాక, అమరావతి పనులను మరింత వేగంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తానికి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడింది.

 

Advertisement

Loading

Trending