Connect with us

Telangana

ఈమె లేడీ కాదు మహా కిలాడీ.. విడాకులు తీసుకున్నా మాజీ భర్తతో కలిసి..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాలు రావటంతో కొన్నాళ్లకు విడిపోయారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయినా మాజీ భర్తను మరిచిపోలేదు. అతడితో కలిసి మోసాలకు తెరలేపింది. నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకొని లక్షలు కాజేస్తుంది. ఆమె చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారి బండారం బయటపడింది. మాజీ భర్తతో కలిసి మల్టీనేషలన్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ మెసాలకు పాల్పడుతుండగా.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్ణాటకకి చెందిన మహ్మద్‌ అలీ, రేష్మ అలియాస్‌ స్వప్న 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఓ ఐటీ జాబ్స్‌ కన్సల్టెన్సీలో అలీ మేనేజర్‌గా రేష్మ ఏమో టెలీ కాలర్‌గా పనిచేసేవాళ్లు. ఆసమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం 2013లో వివాహం చేసుకున్నారు. విభేదాల కారణంగా 2022లో విడాకులు తీసుకున్నారు. ఐటీ ఉద్యోగాల గురించి ఇద్దరికీ అవగాహన ఉండటంతో మోసాల బాటపట్టారు. విడాకుల తర్వాత రేష్మ మరొకర్ని పెళ్లి చేసుకున్నా.. మాజీ భర్తతో మోసాల సంబంధాలు మాత్రం కొనసాగిస్తూ వస్తుంది. రెండో భర్తకు తెలియకుండా మోసాలకు పాల్పడుతోంది.

కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని పలువురు నిరుద్యోగులను నమ్మించింది. మల్టీ నేషనల్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వివిధ వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు గాలం వేసింది. ఈ సంస్థల్లో ఉద్యోగం కావాలనుకుంటే అడ్వాన్సు కింద కొంత డబ్బులు ఇవ్వాలని వారిని నమ్మించింది. డబ్బులు తీసుకున్న తర్వాత.. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం వచ్చినట్లు ఆ సంస్థ పేర్లతో ఉన్న మెయిల్‌ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్ పంపించేవారు. ఆ తర్వాత ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయేవారు.

ఇలానే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతిని ఐబీఎం, కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించింది. ఉద్యోగాలు నిజమేనని నమ్మిన యువతి తనకు తెలిసినవారి ద్వారా డబ్బులు కట్టించింది. ఇలా దాదాపు 10 మంది నుంచి రూ.58.75 లక్షల వరకు వసూలు చేసి ఫేక్ ఆఫర్ లెటర్లు ఇచ్చింది. ఆ తర్వాత ఫోన్లకు రేష్మ స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు రేష్మను అరెస్టు చేయగా.. తన మాజీ భర్త సాయంతోనే ఈ వ్యవహారం అంత నడిపినట్లు ఒప్పేసుకుంది. ఆమె వద్ద నుంచి 15 ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఆరు చెక్‌బుక్‌లు, 10 సిమ్‌కార్డులు, ఒక కారు, డెబిట్, క్రెడిట్‌కార్డుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితురాలు రేష్మపై మూడు రాష్ట్రాల్లో 13 కేసులున్నాయని పోలీసులు చెప్పారు.

Loading

Advertisement

Trending