Connect with us

Telangana

మొసళ్లు, ఏనుగులను తీసుకెళ్తున్న లారీ బోల్తా.. దాంతో రోడ్డుపై మొసళ్లు..

నిర్మల్ జిల్లాలో అరుదైన వన్యప్రాణులు, మెుసళ్లు, ఏనుగులు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీళ్లలో ఉండే ప్రమాదకర మెుసళ్లు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన మొండిగుట్ట దగ్గర ఉన్న 44వ జాతీయ రహదారిపై జరిగింది.అదుపుతప్పి లారీ ప్రమాదానికి గురి కాగా.. అందులోని రెండు మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. బిహార్‌ రాష్ట్రం పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలాజికల్ పార్కు నుంచి బెంగళూరు బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కుకు వన్యప్రాణులను తరలిస్తుండగా.. మొండిగుట్ట గ్రామ సమీపంలో లారీ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వన్యప్రాణులు సురక్షితంగా బయటపడ్డాయిప్రమాదం జరిగిన వెంటనే లారీలోని రెండు మెుసళ్లు రోడ్డుపై పడిపోయాయి. అవి తప్పించుకోడానికి ప్రయత్నించాయి, కానీ చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే తెలంగాణ అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరించారు. బుధవారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పడు లారీలో రెండు తెల్ల ఏనుగులు, 8 మెుసళ్లు మరియు ఇతర అరుదైన జంతువులు ఉన్నాయని చెప్పారు.

నేషనల్ హైవే 44పై మొండిగుట్ట సమీపంలోకి రాగానే.. అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీ కొట్టినట్లు చెప్పారు. ప్రమాదం కారణంగా లారీ పల్టీలు కొట్టిందన్నారు. దీంతో అందులోని జంతువుల్లో రెండు మెుసళ్లు రోడ్డుపై పడిపోయాయి. అవి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో తమ బృందం వాటిని చాకచక్యంగా పట్టుకుందని అన్నారు. మిగిలిన ఆరు మొసళ్లు, రెండు తెల్ల ఏనుగులు, ఇతర వన్యప్రాణులు వాహనంలోనే సురక్షితంగా ఉన్నాయన్నారు.

జంతువులను బెంగళూరుకు తరలించేందుకు మరో వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై పడిపోయిన మెుసళ్లు, జంతువులను చూసేందుకు స్థానికులు అక్కడ భారీగా చేరుకున్నారు. అందువల్ల, పోలీసులు వారిని దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

Advertisement

Loading

Trending