Connect with us

Andhra Pradesh

నాకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు అందిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఆయన, రాష్ట్ర డీజీపీ మరియు విశాఖ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తూ, 2019 నుండి 2024 వరకు తన భద్రత కోసం అందించిన పోలీసు రక్షణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆ లేఖలో, రిషికేశ్‌లో తపస్సులో గడపాలని అనుకుంటున్నానని, అందుకే తనకు కేటాయించిన గన్‌మెన్‌లను తిరిగి తీసుకోవాలని పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని శారదాపీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వం, భీమిలి మండలం కొత్తవలస సమీపంలో ఈ భూమిని నామమాత్ర ధరకే కేటాయించగా, ఆ భూమి విలువ దాదాపు రూ.225 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయబడింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఈ భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది.

ఇక 2023 డిసెంబరు 26న, టీటీడీ బోర్డు తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద శారదాపీఠానికి భూమిని కేటాయించింది. కానీ, తిరుమలలో శారదా పీఠం కోసం భూమి కేటాయింపు, భవన నిర్మాణం నిర్ణయాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. దేవాదాయశాఖ టీటీడీ ఈవోకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి భూ కేటాయింపులు, నిర్మాణ నిర్ణయాలు ముందుగా ప్రభుత్వ పరిశీలనకు పంపాలని సూచించింది.  టీటీడీ, తిరుమలలో చేపట్టిన నిర్మాణాలపై న్యాయపరంగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని, ఈ పనులకు నాలుగు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది.

Loading

Trending