Connect with us

Andhra Pradesh

తిరుమల శ్రీవారి భక్తులకు మంచి వార్త.. దర్శన టికెట్లు అక్కడ కూడా ఇస్తారు..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల ఇచ్చే ప్రక్రియను ఇంకా సులభంగా చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌ను అడిషనల్ ఈవో ప్రారంభించారు. కౌంటర్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్‌ను కేటాయించారు. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించినట్లు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అందుకే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చన్నారు వెంకయ్య చౌదరి. ప్రతి రోజూ 900 శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేదని.. ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, ఏఈవో కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జరిపారు. తెల్లవారు జామున 4.30 గంటల నుంచి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి సమేతంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులకు కనిపిస్తారు. అక్కడక్కడా చిరు జల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఉగ్ర శ్రీనివాసమూర్తిని.. ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారు వాకిలి దగ్గర వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయర్‌స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Loading

Advertisement

Trending