Connect with us

Telangana

యాదాద్రి లడ్డూకు వినియోగించే నెయ్యిపై ఈవో భాస్కర్ రావు కీలక ప్రకటన..

తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కాసుల కోసం కక్కుర్తి పడి లడ్డూకు వినియోగించే నెయ్యిని కల్తీ చేశారని.. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ఆరోపించారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డూ వివాదంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల ప్రసాదాల తయారీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే, తెలంగాణ తిరపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిపై ఆ దేవస్థానం ఈవో భాస్కర్ రావు కీలకమైన ప్రకటన చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదిగా తేలిందని ఆయన అన్నారు. లడ్డూ ప్రసాదాల తయారీకి మదర్‌ డెయిరీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ నెయ్యి శాంపిల్స్ ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్‌ నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించినట్లు వెల్లడించారు. ల్యాబ్‌లో టెస్టులు జరిపగా.. ఆ నెయ్యి స్వచ్ఛమైనదిగా తేలిందని అన్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆయన చెప్పారు. ఆ టెస్టుల్లో నెయ్యి స్వచ్ఛమైనదని తేలిందన్నారు. ఆ నివేదిక సైతం యాదాద్రి దేవస్థానానికి అందిందని ఈవో వెల్లడించారు. మదర్ డెయిరీ నుంచి కేజీ రూ.609కు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆ నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయంలో ప్రసాదాల తయారీకి ప్రతి రోజు వెయ్యి కిలోల నెయ్యి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏడాది దాదాపుగా రూ.15 కోట్ల విలువైన నెయ్యిని మదర్‌ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. అది కూడా టెండర్‌ ప్రక్రియ ద్వారానే గత నలభై ఏళ్లుగా నెయ్యి కొనుగోళ్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు.

ఇప్పటి నుంచి యాదాద్రి ఆలయంలో లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సర్కార్ ఆదేశాల మేరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. విజయ డెయిరీ నెయ్యి వాడాలని రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుతం పాత టెండర్‌ కొనసాగుతుందని అన్నారు. ఆ టెండర్ ప్రక్రియ ముగిసే వరకు అంటే మార్చి నెలాఖరు వరకు మదర్‌ డెయిరీ నెయ్యినే వినియోగించనున్నట్లు ఈవో భాస్కర్ రావు స్పష్టం చేసారు.

Advertisement

Loading

Trending