Connect with us

Telangana

నెక్ట్స్ ఫోకస్ ఆ ఏరియాపైనే..!దూసుకురానున్న ‘హైడ్రా’ బుల్డోజర్లు

నెక్ట్స్ ఫోకస్ ఆ ఏరియాపైనే..!దూసుకురానున్న ‘హైడ్రా’ బుల్డోజర్లు

హైడ్రా బుల్డోజర్లు దూసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాంతంపై దృష్టి పెట్టిన హైడ్రా అధికారులు జలాశయం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో సర్వే చేస్తున్నారు. సర్వే అనంతరం అటుగా బుల్డోజర్లు పంపేందుకు రెడీ అవుతున్నారు. అక్కడ భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని కూల్చివేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.

గత మూడు నెలల కాలంలో వందల నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేసారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయింది. అయితే హైడ్రా కూల్చివేతలపై కొ న్ని వర్గాల నుంచి వ్యతిరేకత, హైడ్రా చట్టబద్దతపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు.

అయితే ఇటీవల హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో హైడ్రాకు హై పవర్స్ వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో హైడ్రా బుల్డోజర్లు దూసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. హిమాయత్ సాగర్ జలాశయం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
దీని కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ భారీగా బిల్డింగులు నిర్మించడంతో వాటిపై దృష్టి పెట్టారు. హిమాయత్ సాగర్ సర్వే పూర్తయిన వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఉస్మాన్ సాగర్‌పై దృష్టి పెట్టేలా హైడ్రా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 549 చెరువులకు హైడ్రా సర్వే చేపట్టనుంది. అందుకు అనుగుణంగా FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పక్కాగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్‌ సర్వేల సహాయంతో చెరువుల విస్తీర్ణాన్ని, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ను డిసైడ్ చేస్తున్నారు. వాటికి జియో ట్యాగింగ్ చేసి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

Loading

Trending