Connect with us

Telangana

స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ మొదలైన ‘హైడ్రా’ కూల్చివేతలు..

స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ మొదలైన హైడ్రాకూల్చివేతలు..

మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్ దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన హైడ్రా అధికారులు.. కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కూల్చివేతలతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది.

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మెుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా కూల్చివేతలకు బ్రేక్ పడగా.. తిరిగి నేడు మళ్లీ మెుదలయ్యాయి. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు. రెండు బృందాలుగా విడిపోయిన హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు. రాంపల్లి దగ్గర రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్ పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా అధికారులు, జేసీబీలు వచ్చి తీరటంతో స్థానికుల్లో టెన్షన్‌ మొదలైంది. తమ ఇళ్లు కూడా కూల్చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. వారికి హైడ్రా అధికారులు భరోసా ఇచ్చారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే నోటీసులు ఇచ్చి కూలుస్తామని.. అనవసరంగా టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు.

హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్థానికులతో మాట్లాడి చర్చించారు. ముందుగా 16 ఎకరాలు ఉన్న బతుకమ్మ కుంట, నిర్మాణ వ్యర్థాలు వేయడంతో ఇప్పుడు 5.15 ఎకరాలకు తగ్గిపోయిందని చెప్పారు. స్థానికుల అభ్యర్థనతో చెరువు పునరుద్ధరణ పనులు చేపడతామని రంగనాథ్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రాకతో ఆ ప్రాంతం లోని స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమ నివాసాలు కూల్చేస్తారనే భయం ఉందని స్థానికులు చెప్పగా, వారికి కమిషనర్ రంగనాథ్ భరోసా ఇచ్చారు.

నివాసాలు, నిర్మాణాల దగ్గర హైడ్రా వెళ్లదని వారికి భరోసా ఇచ్చారు. బతుకమ్మ కుంటలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని చెప్పారు. కుంటను పునరుద్ధరిస్తామని, ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దితే మీ నివాసాలకు విలువ పెరుగుతుందని తెలిపారు. కూల్చివేతల చేపడతామనే అపోహ స్థానికుల్లో ఉందని.. దాన్ని తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతమున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలోనే పునరుద్ధరణ చేస్తామన్నారు. చెరువులోకి వరద నీరు వచ్చే మార్గాలపై అధికారులతో చర్చిస్తామని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని.. ఆక్రమణదారులకు హైడ్రా నోటీసులు వెళ్తూనే ఉంటాయని చెప్పారు. హైడ్రా కమిషనర్‌ రాకతో బతుకమ్మ కుంట పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Loading

Trending